తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సింగిల్ పిక్ కాటన్ (ఒకే కాత పత్తి) సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది. దీనిపై సీఎస్ సోమేశ్కుమార్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సీజన్ నుంచి సింగిల్ పిక్ కాటన్ సాగును ప్రారంభించనున్నట్టు తెలిపారు. తొలిదశలో 45 వేల ఎకరాల్లో సాగు చేయనున్నట్టు తెలిపారు. గతంలో ప్రయోగం చేసిన ప్రాంతాల్లో సాగు విస్తీర్ణాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ విధానం ద్వారా 40 శాతం అధిక దిగుబడి వస్తుందని అన్నారు.
సింగిల్ పిక్ కాటన్ సాగుపై ఎంపిక చేసిన రైతులకు అవగాహన కల్పించాలని సీఎస్ సూచించారు. అధిక సాంద్రత పద్ధతిలో పత్తిసాగు (హై డెన్సిటీ) విధానాన్ని ప్రోత్సహించేందుకు విత్తన కంపెనీల సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేసి చర్చించాలని వ్యవసాయ శాఖ అధికారులను సీఎస్ ఆదేశించారు. సింగిల్ పిక్, హైడెన్సిటీ పత్తి సాగు చేసే రైతుల వివరాలను సేకరించాలని చెప్పారు. రైతుల వివరాలు, వర్షపాతం, పంటల క్యాలెండర్ వివరాలతో కూడిన యాప్ ను రూపొందించాలని తెలిపారు.