ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిమ్స్‌లో వృద్ధులకు భరోసా.. ప్రత్యేకంగా జీరియాట్రిక్‌ విభాగం ఏర్పాటు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, May 26, 2022, 11:55 AM
నిమ్స్‌ దవాఖాన మరో అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్నది. వృద్ధుల కోసం ప్రత్యేకంగా ‘జీరియాట్రిక్‌ డిపార్ట్‌మెంట్‌’ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా దక్షిణ భారతదేశంలో ఈ విభాగాన్ని కలిగే మూడో దవాఖానగా రికార్డు సాధిస్తుంది. ప్రస్తుతం చెన్నైలోని ఎంఎంసీ, వెల్లూరులోని సీఎంసీలో మాత్రమే ప్రత్యేక జీరియాట్రిక్‌ విభాగాలు ఉన్నాయి. దీంతోపాటు నిమ్స్‌లో ఎండీ జీరియాట్రిక్‌ కోర్సు, పీజీ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. వాస్తవానికి నిమ్స్‌లో 2018 నుంచే జీరియాట్రిక్‌ వార్డు సేవలు అందిస్తున్నది. 65 ఏండ్లు పైబడినవారికి ఇక్కడ ఐపీ సేవలు అందుతున్నాయి. ప్రస్తుతం దీనిని పూర్తిస్థాయి విభాగంగా మార్చటంతోపాటు రీజినల్‌ జీరియాట్రిక్‌ సెంటర్‌గా మార్చనున్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలో ఎక్కడైనా వృద్ధుల కోసం ప్రత్యేకంగా వార్డులు ఏర్పాటు చేస్తే నిమ్స్‌ నోడల్‌ సెంటర్‌గా సేవలు అందిస్తుంది. దేశవ్యాప్తంగా వృద్ధుల జనాభా క్రమంగా పెరుగుతున్నది. దీనికి అనుగుణంగా అనారోగ్య సమస్యలతో దవాఖానకు వచ్చేవారు ఎక్కువవుతున్నారు. వారికి సులభంగా, వేగంగా సేవలు అందించేందుకు వీలుగా జీరియాట్రిక్‌ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చిన్న పిల్లలకు ప్రత్యేకంగా పీడియాట్రిక్‌ విభాగం ఉన్నట్టు, జీరియాట్రిక్‌ విభాగం పూర్తిగా వృద్ధులకే సేవలు అందిస్తుంది.

నిమ్స్‌ జీరియాట్రిక్‌ విభాగం విశేషాలు ప్రస్తుతం జీరియాట్రిక్‌ వార్డులో 38 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 6 ఐసీయూ, 4 హెచ్‌డీయూ, 28 ఆక్సిజన్‌ పడకలు ఉన్నాయి. త్వరలో పడకల సంఖ్యను 44కు పెంచనున్నారు. అదనంగా పోర్టబుల్‌ ఎక్స్‌-రే, అల్ట్రాసౌండ్‌, 2డీ ఎకో, 8 వెంటిలేటర్లు, 10 మానిటర్లు కొనుగోలు చేశారు. ఇక్కడ వృద్ధులకు ఐపీ, ఓపీ, ఐసీయూ సేవలు అందుతాయి. అల్ట్రాసౌండ్‌, 2డీ ఎకో, ఎక్స్‌-రే వంటి పరీక్షలు చేస్తారు. బోన్‌ మినరల్‌ డెన్సిటీ స్కానర్‌ వంటి అత్యాధునిక పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. ఫిజియో థెరపీ సేవలు కూడా అందుతాయి.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com