తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాలలో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న రెండు రోజుల్లో ఆయా జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
వర్షాలు పడే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మధ్యప్రదేశ్ నుంచి మరాఠ్వాడా, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఉత్తర–దక్షిణ ద్రోణి విస్తరించిందని పేర్కొంది. సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఇది కొనసాగుతోందని తెలిపింది. రానున్న రెండు రోజుల్లో హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉందని, 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని వివరించింది.