తెలంగాణ బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగిసింది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. ఇప్పటికే హైదరాబాద్ వచ్చిన ఆయన ఇతర అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసుకుని పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ తరుణంలో అమిత్ షా తెలంగాణ పర్యటనపై రాష్ట్ర మంత్రి హరీష్ రావు సెటైరికల్ ట్వీట్ పెట్టారు. శనివారం తన ట్విట్టర్లో వ్యంగ్యపూరిత ట్వీట్ పెట్టారు. 'వలస పక్షులు వస్తుంటాయి.. పోతుంటాయి. ఇష్టమైన ప్రదేశాలు, ఆహారం ఆస్వాదించి సంతోషంగా వెళ్తాయి. ఇవాళ ప్రపంచ వలస పక్షుల దినోత్సవం కావడం యాదృచ్ఛికం' అని ట్వీట్ చేశారు.
ఇప్పటికే రానున్న ఎన్నికల్లో తెలంగాణలో అధికారం చేపట్టాలని బీజేపీ భావిస్తోంది. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తోంది. ఈ తరుణంలోనే అమిత్ షాను రాష్ట్రానికి పార్టీ నేతలు రప్పించారు. అయితే ఆయన రాకపై టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణకు ఆయన ఏం చేశారో సభలో చెప్పాలని కేటీఆర్, రేవంత్ రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు. ప్రశ్నలతో కూడిన లేఖలను వారిరువరూ సంధించారు. ఇక టీఆర్ఎస్తో బీజేపీ లాలూచీ పడిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇక బీజేపీ తలపెట్టిన సభలో అమిత్ షా చేసే ప్రసంగంపై తీవ్ర రాజకీయ చర్చ సాగుతోంది.