బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె తొలిసారి తెలుగులో నటిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా సినిమా ప్రాజెక్ట్ కే లో ప్రభాస్ కు జతగా దీపికా పదుకొణె నటిస్తుంది. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో జరుగుతుంది. ఐతే, పోయిన వారంలో ఈ మూవీ షూటింగ్ అకస్మాత్తుగా ఆగిపోయిందని, అందుకు దీపికా అనారోగ్యం పాలవ్వడమే కారణమని, దీపికా ఆరోగ్యం కుదుటపడేందుకు ఒక వారం రోజులపాటు షూటింగ్ ను వాయిదా వేయమని మేకర్స్ ను ప్రభాస్ అడిగారని... ఇలా పలు రకాల వార్తలు మీడియాలో హల్చల్ చేసాయి. ఆ తర్వాత ప్రాజెక్ట్ కే నిర్మాత అశ్వినీదత్ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. దీపికా అనారోగ్యం పాలవడం నిజమేనని, కాకపోతే ఒకగంటలోనే ఆరోగ్యంగా హాస్పిటల్ నుండి తిరిగొచ్చి షూటింగ్ లో పాల్గొందని, షూటింగ్ మాత్రం క్యాన్సిల్ అవ్వలేదని, సజావుగానే సాగుతుందని చెప్పారు. సీన్ కట్ చేస్తే, దీపికా ముంబై ఎయిర్ పోర్ట్ లో నిన్న ప్రత్యక్షమైంది. హైదరాబాద్ నుండి ముంబై వచ్చిన కొన్ని గంటలకే దీపికా ముంబై విడిచి మరో ప్రదేశానికి ఫ్లైట్ లో వెళ్లినట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఆమె ఎయిర్ పోర్ట్ ఫోటోలు, వీడియోలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీన్నిబట్టి ప్రాజెక్ట్ కే షూటింగ్ వాయిదా వేయమని ప్రభాస్ మేకర్స్ ను అడగడం నిజమేనేమో అనిపిస్తుంది.