మెగాస్టార్ చిరంజీవి హీరోగా, ఆయన తనయుడు రామ్ చరణ్ కీలక పాత్రలో తెరకెక్కిన సినిమా 'ఆచార్య' ఏప్రిల్ 29న విడుదల అయింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. విడుదలైన నాటి నుంచే అంచనాలను అందుకోలేకపోవడంతో కలెక్షన్లు కూడా నెమ్మదించాయి. దీంతో ఆ సినిమాకు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ నుంచి మంచి ఆఫర్ వచ్చింది. ఎంపిక చేసిన తేదీ కంటే ముందుగానే ఈ సిినిమాను విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఎర్లీ విండో ప్రాసెస్ కింద ఈ సినిమాకు అమెజాన్ అదనంగా డబ్బులు చెల్లించనుంది. గతంలో రాధేశ్యామ్ సినిమాకు ఈ విధానంలో అదనంగా రూ.25 కోట్లను అమెజాన్ ప్రైమ్ చెల్లించింది. అదే పద్ధతిని ఆచార్య సినిమాకు కూడా పాటించనున్నట్లు తెలుస్తోంది.
ఆచార్య సినిమాను ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మే 30న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల చేయాలని భావించారు. అయితే సినిమాను ఎర్లీ విండో ప్రాసెస్ కింద మే 12న విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా కథపై ఎంతో ఇష్టంతో చిరంజీవి, రామ్చరణ్ రెమ్యూనరేషన్ ఏమీ తీసుకోలేదు. ఈ సినిమా నష్టాల బారిన పడకుండా ఉండాలంటే ఓటీటీలో ముందుగా విడుదల చేయడమే ఉత్తమమని అంతా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే చిరు సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ను ముందుగానే అలరించనుంది. అయితే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.