గుడిలోకి ప్రవేశించిన దొంగ దేవతకు మాత్రం భక్తితో దండం పెట్టాడు..అక్కడి హుండి ఎత్తుకెళ్లాడు. సీన్ కట్ చేస్తే ...ఎప్పటి మాదిరే ఉదయం ఆలయం తెరిచి చూడగా ఆలయ నిర్వాహకులకు లోపల హుండీ కనిపించలేదు. సీసీటీవీ కెమెరా రికార్డులు పరిశీలించగా.. ముఖానికి గుడ్డ చుట్టుకుని, నిక్కర్, బనియన్ వేసుకున్న ఓ వ్యక్తి ఆలయం గర్భగుడిలోకి చొరబడడం రికార్డు అయింది. గర్భగుడిలోకి అడుగుపెట్టి అమ్మవారిని చూసిన వెంటనే దొంగ ముందుగా రెండు చేతులు జోడించి నమస్కరించుకోవడం కనిపించింది. ఆ తర్వాత అమ్మవారి ఎదురుగా ఉన్న హుండీని తీసుకుని బయటకు వెళ్లిపోయాడు.
మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో ఇది జరిగింది. ఈ వీడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లోకి చేరింది. దీన్ని చూసిన వారు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు సానుభూతి కూడా వ్యక్తం చేస్తుండడం ఆశ్చర్యకరం. మనుగడ కోసమే ఈ పనిచేశాడని, అతడు నిజాయతీ పరుడని, ఇలా ఎవరికి తోచిన కామెంట్ వారు పెడుతున్నారు.