‘ఇకపై మీ దగ్గర్నుంచి ఎలాంటి రుణాలు తీసుకోబోం.. కేవలం నిధులను మాత్రమే స్వీకరిస్తాం’ అని చైనాకు నేపాల్ తేల్చి చెప్పింది. ఇదిలావుంటే శ్రీలంకకు 51 బిలియన్ డాలర్ల విదేశీ రుణాలు ఉండగా.. అందులో 10 శాతం చైనా నుంచి తీసుకున్నవే. హంబన్టోట పోర్టు లంక పాలిట గుదిబండగా మారింది. ఈ పోర్టు నిర్మాణం కోసం చైనా నుంచి తీసుకున్న అప్పులు తీర్చలేక.. 99 ఏళ్లపాటు దాన్ని చైనాకు లీజ్కు ఇవ్వాల్సి వచ్చింది. శ్రీలంక తర్వాత చైనా అప్పుల ఊబిలో చిక్కుకున్న మరో దేశం పాకిస్థాన్. మన పొరుగు దేశంలో బీఆర్ఐ ప్రాజెక్టుల కింద చైనా 53 బిలియన్ డాలర్లు వెచ్చించింది. కానీ బలూచిస్థాన్ ఆందోళనల కారణంగా ఇప్పటికీ గద్వార్ పోర్టు పనులు పూర్తి కాలేదు. గద్వార్ పోర్టు పాకిస్థాన్ ఆర్థిక భవిష్యత్తు అని.. ఇది దుబాయ్కు ప్రత్యామ్నాయమని ప్రచారం చేశారు. కానీ అది కాస్తా ఇస్లామాబాద్ పీకకు వేలాడుతున్న కత్తిలా మారింది. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న పాకిస్థాన్.. ఐఎంఎఫ్ నుంచి భారీగా రుణం తీసుకుంటోంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు పడిపోవడం, ఆహార, ఇంధన ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయికి చేరడం, కరోనా ఎఫెక్ట్, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.