ఆసుపత్రికి వచ్చే గర్భిణీలకు అత్యుత్తమ వైద్య సేవలను అందించాలని జిల్లా ఇంచార్జి మంత్రి మరియు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్యా శాఖమంత్రి విడదల రజని వైద్యులకు సూచించారు. గురువారం సాయంత్రం మంత్రి , జిల్లా కలక్టరు డా. ఎ. మల్లిఖార్జునతో కలిసి ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రిని పరిశీలించారు. ముందుగా వార్డులో ఉన్న గర్భిణీ స్త్రీలు, బాలింతలతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలను గురించి అడిగి తెలుసుకొని, వారికి పండ్లు పంపిణీ చేసారు. వార్డులో పని చేస్తున్న డాక్టర్లతో మాట్లాడి కేస్ షీట్ లను పరిశీలించి , తగు సూచనలు చేసారు. వార్డు పరిసరాలను పరిశీలించారు. అక్కడ అందుతున్న వైద్య, ఇతర సేవలపై వైద్యులను ఆరా తీశారు. ఆరోగ్య మిత్రలు ప్రభుత్వ రాయితీలను వివరించాలన్నారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా మంజూరు అయిన కొత్త ఆసుపత్రి భవనం యెక్క మోడల్ ఫోటోలను అక్కడ ఎర్పాటు చేసిన ఎగ్జిబిషన్ బోర్డులపై పరిశీలించారు. మంత్రి నేరుగా చిన్నారిని ఎత్తుకుని తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనం దగ్గరకు తీసుకొచ్చి తల్లీబిడ్డలను క్షేమంగా వాహనంలో పంపించారు. ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. ప్రసాద్ ఉష, ఆఫీస్ సూపరింటెండెంట్ విజయ్ కుమార్, ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ బి. ఎ. నాయుడులు మంత్రి వెంట ఉన్నారు.