డెంకాడ మండల కేంద్రానికి ఆనుకుని ఉన్న దొడ్డిబాడువ సమీపంలోగల చంపావతి నదిలో మునిగి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. డెంకాడ ఎస్ఐ ఎన్. పద్మావతి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరంలోని కొత్తపేట కుమ్మరివీధికి చెందిన ఎ. శ్రీనివాసరావు(47) గురువారం తమ స్నేహితులతో కలిసి సరదాగా చంపావతి నదీ తీర ప్రాంతానికి వచ్చాడు.
ఈత కొడదామని ఆలోచనతో చంపావతి నదిలోకి దిగాడు. అయితే అతనికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. స్నేహితులకు కూడా ఈత రాకపోవడంతో కాపాడలేకపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. మృతుడు శ్రీనివాసరావు విజయనగరంలో వండ్రంగిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మృతుడికి భార్య, ఏడేళ్ల కొడుకు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ పద్మావతి తెలిపారు.