కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రాహుల్కు తల్లి సోనియా ఆశీస్సులు అందించారు. రాహుల్ పట్టాభిషేక కార్యక్రమం తర్వాత ఆమె మాట్లాడారు. తన అత్త మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తనను ఓ కూతురిలా చూసుకుందన్నారు. భారత్ గురించి ఇందిరా నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నట్లు సోనియా తెలిపారు. అత్త ఇందిరా, భర్త రాజీవ్ గాంధీ దూరమైన తర్వాత తాను కోలుకునేందుకు చాలా సమయం పట్టిందన్నారు. 2014 నుంచి ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నామని, ఇప్పుడు దేశం ఓ పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నదని, రాజ్యాంగ విలువలపై దాడి జరుగుతుందని, తమ పార్టీ ఇటీవల చాలా వరకు ఎన్నికల్లో ఓటమి పాలైందని, కానీ తాము మాత్రం తలవంచబోమన్నారు. తాము బెదిరిపోయేవాళ్లం కాదు అని, ఎవరికీ తలవంచమని, దేశ హితం కోసం సంఘర్షణ చేస్తూనే ఉంటామని సోనియా అన్నారు. దేశంలో ఓ రకమైన భయంకరమైన వాతావరణం నెలకొన్నదని, దాన్ని మార్చేస్తామన్నారు. రాహుల్ తన చిన్నతనం నుంచే ఎన్నో హింసాత్మక ఘటనలను చూశారని, రాజకీయాల్లో చేరిన తర్వాత కూడా అతనిపై వ్యక్తిగతంగా ఎంతో మంది దాడి చేశారని, కానీ అవన్నీ రాహుల్ను మరింత రాటుదేలేలా చేశాయని సోనియా తెలిపారు. మంచి హృదయం, ధైర్యం, సమర్థనతో రాహుల్ పనిచేస్తారని ఆశిస్తున్నట్లు సోనియా చెప్పారు. తనకు ఇన్నాళ్లూ అండగా నిలిచిన దేశ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అంతకముందు సోనియాకు ఓ మెమొంటోను ప్రజెంట్ చేశారు మన్మోహన్.