రాష్ట్రంలో నేరాలు, కేసుల సంఖ్య తగ్గించడమే లక్ష్యంగా పోలీసులు పనిచేయాలని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా ప్రశాంత వాతావరణం కొనసాగేలా మరిన్ని చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు పాటుపడుతున్నారని.. రాష్ట్రం ప్రశాంతంగా ఉంటేనే ఆయన ప్రయత్నాలు ఫలిస్తాయన్నారు. రాష్ట్రంలో గందరగోళం సృష్టించేందుకు వైకాపా ప్రయత్నిస్తోందని, వాటిని ముందుగానే పసిగట్టి తిప్పికొట్టాలన్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీసుల కోసం నూతనంగా నిర్మించిన అతిథిగృహాలు, డార్మెటీలు, భోజనశాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. దీనిలో డీజీపీ సాంబశివరావు, అన్ని జిల్లాల ఎస్పీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రసార మాధ్యమాల్లో వచ్చే నేరవార్తలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. కొన్నిచోట్ల భూ సెటిల్మెంట్లలో పోలీసులు పాల్గొంటున్నారని.. ఇప్పట్నుంచైనా వాటికి దూరంగా ఉండాలన్నారు. పోలీసులు ఎప్పుడూ పేదల పక్షమే ఉండాలని.. అవినీతిని పూర్తిగా నిర్మూలించేలా ఎస్పీలు చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక అక్రమ రవాణా, మాఫియాపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.