-ఆయనకు మరింత రాజకీయ పరిణతి అవసరం ఇందుకు మరికొంత సమయం పడుతుంది
-తరాల మార్పులోకి కాంగ్రెస్ వెళ్ళింది పార్టీ రాజకీయ పరిభాషలో చాలా మార్పు వచ్చింది
-యుపి ఎన్నికల్లో ఎస్పి-కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తుంది
-ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అంతగా పరిణతి చెందిన రాజకీయ వేత్త కాదని, ఇంకా పరిణతి చెందాల్సి వుందని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అన్నారు. రాజకీయంగా రాహుల్ పరిణతి చెందేందుకు మరికొంత సమయం పడుతోందన్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో షీలా దీక్షిత్ ఒక ఆంగ్ల పత్రికకు ఇంటర్వూ్య ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తరాల మార్పులోకి కాంగ్రెస్ వెళ్ళిందన్నారు. గత కొన్నేళ్ళుగా దాని రాజకీయ పరిభాషలో కూడా చాలా మార్పు వచ్చిందన్నారు. ఈ క్రమంలో రాహుల్ ఇంకా పరిణతి చెందలేదన్నారు. ఆయన వయస్సు కూడా అందుకు అనుమతించడం లేదని పేర్కొన్నారు. రాహుల్ పరిణతి చెందేందుకు మరికాస్త సమయం పడుతుందన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతిని కాంగ్రెస్ విశ్వసిస్తోందని చెప్పారు. రాహుల్ తన మనస్సులో ఏమున్నదో అదే మాట్లాడతారన్నారు. రాహుల్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. యుపి ఎన్నికల్లో ఎస్పి-కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తుందని దీక్షిత్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పక్షాన ప్రచారం చేసేందుకు తాను కూడా సిద్ధమేనన్నారు.