భారతదేశ ప్రధానిగా ఎవరుంటే బాగుంటుందన్న విషయంలో దక్షిణ భారతంలో నరేంద్ర మోడీకి జనం నో అనగా రాహుల్ గాంధీకి మాత్రం జై కొట్టినట్లు ఇండో ఏషియన్ న్యూస్ సర్వీస్ (ఐఏఎన్ఎస్)-సి ఓటర్ నిర్వహించిన సర్వేలో తేలింది. దేశానికి కాబోయే ప్రధాని ఎవరైతే బాగుంటుందని తమిళనాడులో నిర్వహించిన ఇదే సర్వేలో రాహుల్గాంధీకి అనుకూలంగా 54 శాతం మంది మద్దతు తెలిపారు. అదే సందర్బంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పనితీరుపై దేశంలోని 45.96 మంది అసంతృప్తి వ్యక్తం చేయగా.. రాహుల్ గాంధీ విషయంలో 44.44 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా తమ ఎమ్మెల్యేల పనితీరుపై 34.2 శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఎంపీల విషయానికొస్తే 35.24 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. ఇదే సమయంలో దక్షిణాదిలో బీజేపీకి ఆదరణ పెరగలేదని సర్వే తేల్చిచెప్పింది.
ఇదిలావుంటే దక్షిణ భారత రాష్ట్రాల్లో ప్రజలు తమ భవిష్యత్తుపై ఆశాభావంతో ఉన్నట్లు తేలిందని తెలిపారు. సుమారు 45 శాతం మంది రాబొయే ఏడాదిలో తమ జీవన ప్రమాణాలు పెరుగుతాయని ఆత్మవిశ్వాసంతో ఉన్నామని చెప్పారు. 13 శాతం మంది మాత్రం తమకు గడ్డు పరిస్థితి తప్పదని స్పందించారు. మరో 12 శాతం మంది వచ్చే ఏడాది కూడా పరిస్థితులు ఇలాగే ఉంటాయనే నిరాశను వ్యక్తం చేశారన్నారు.