ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణలో నీలం సంజీవరెడ్డిది ప్రముఖపాత్ర అని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ అన్నారు. భారత దేశ ఆరవ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జయంతిని పురస్కరించుకుని గురువారం విజయవాడ ఆంధ్ర రత్న భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. నీలం సంజీవరెడ్డి భారత రాష్ట్రపతి గా, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా, లోక్సభ సభాపతి గా, ఆంధ్ర రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, సంయుక్త మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా, కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిగా వివిధ పదవులను అలంకరించి, ప్రజల మన్ననలను పొందిన రాజకీయవేత్త అని శైలజనాథ్ కొనియాడారు. 1929 లోనే మహాత్మా గాంధీ స్ఫూర్తితో చదువును పక్కనపెట్టి రాజకీయాల్లో చేరి స్వాతంత్య్ర పోరాటం వైపు దృష్టి సారించి 1937లో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెసు కమిటీకి కార్యదర్శిగా ఎన్నికై దాదాపు పదేళ్ళపాటు ఆ పదవిలో కొనసాగారని శైలజనాధ్ గుర్తు చేశారు, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళారని చెప్పారు. 1940, 1945 ల మధ్య ఎక్కువకాలం సంజీవరెడ్డి జైలులో ఉన్నారని, 1946లో మద్రాసు శాసనసభకు ఎన్నిక కాగా 1947లో రాజ్యాంగ నిర్మాణ సంఘమైన రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారని వివరించారు.