చెన్నై: జయ టీవీ ఆఫీసుపై ఇవాళ ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. చెన్నైలో ఉన్న ఆఫీసుకు ఐటీ అధికారులు వెళ్లారు. ఆదాయ పన్ను ఎగవేసారన్న ఆరోపణలపై ఆ టీవీ ఆఫీసుపై దాడులు కొనసాగుతున్నాయి. మావిస్ సాట్కామ్ లిమిటెడ్ కంపెనీ పేరు మీద జయ టీవీ రిజిస్టరై ఉన్నది. తమిళనాడు దివంగత సీఎం జయలలితకు అత్యంత సన్నిహితురాలైన వీకే శశికళ ఇన్నాళ్లూ జయ టీవీని ప్రమోట్ చేస్తున్నారు. శశికళ మేనల్లుడు వివేక్ జయరామన్ ఆ టీవీ మేనేజ్మెంట్ చూస్తున్నారు. చాన్నాళ్లుగా అన్నాడీఎంకే పార్టీకి ప్రధాన అస్త్రంగా జయ టీవీ నిలిచింది. అయితే ఇటీవల అన్నాడీఎంకే నేత, సీఎం పళనిస్వామి పన్నీరుసెల్వంతో జతకట్టడం వల్ల పార్టీకి, ఛానల్కు మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ మధ్య జరిగిన సమావేశంలో జయ టీవీని మళ్లీ పునరుద్దరించాలని అన్నాడీఎంకే పార్టీ తీర్మానించింది. ఇంకా శశికళ ఫ్యామిలీ చేతిలోనే నమధు ఎంజీఆర్ పత్రిక కూడా ఉన్నది. అయితే ఇవాళ జరిగిన ట్యాక్స్ దాడులను జయ టీవీ ఖండించింది. ఇండిపెండెంట్ మీడియాపై ఇది దాడి అని ఆ సంస్థ పేర్కొన్నది. జయ టీవీ నెట్వర్క్ గ్రూపులో న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీ ఛానళ్లు ఉన్నాయి. 1999లో తమిళనాడు దివంగత సీఎం జయలలిత జయ టీవీని స్టార్ట్ చేశారు. ప్రస్తుతం శశికళ ఫ్యామిలీ చేతిలో జయ నెట్వర్క్ ఉంది. జాజ్ సినిమా హౌజ్ కూడా ప్రస్తుతం శశికళ ఫ్యామిలీ ఆధీనంలోనే ఉన్నది.