తిరుమల శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం బుధవారం వైభవంగా జరిగింది. వేకువజామున 4:30గంటల నుంచి 5:30 మధ్య శ్రీదేవి భూదేవి సమేత శ్రీఉగ్రశ్రీనివాసమూర్తి తిరువీధుల్లో విహరించారు. ఉత్సవ మూర్తులు ఆలయంలోకి ప్రవేశించిన అనంతరం అర్చకులు ఆస్థానం ఘనంగా నిర్వహించారు. ఏడాదిలో కైశిక ద్వాదశి రోజున మాత్రమే ఉగ్రశ్రీనివాసమూర్తి తిరువీధుల్లో సూర్యోదయానికి ముందే వూరేగడం ఆనవాయితీ. కుండపోతగా కురుస్తున్న వర్షంలో స్వామి వారు తిరువీధుల్లో వూరేగుతూ భక్తులను కటాక్షించారు.