ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నిన్న మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది మరింతగా బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అనంతరం ఇది అండమాన్ దీవుల వెంట కదులుతూ రేపటికి తండ్వే (మయన్మార్) సమీపంలో తీరం దాటుతుందని పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో నిన్న ఏపీలోని పలు చోట్ల వర్షాలు కురిశాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లా మదనపల్లెలో 65.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురవగా నర్సీపట్నంలో 38.75, ప్రకాశం జిల్లా కనిగిరిలో 37, తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో 35 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక, విశాఖ మన్యంలోని నర్సీపట్నం, పాడేరు, కొయ్యూరు, హుకుంపేట, కోటవురట్ల మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. పలు ప్రాంతాల్లో భారీవృక్షాలు నేలకొరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.