ద్విచక్ర వాహనం నడుపుతున్న సమయంలో ఓ యువకుడికి ఆకస్మాత్తుగా ఫిట్స్ వచ్చి బైక్ ప్రమాదానికి గురై రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న మహిళకు బైక్ తో ఢీ కొట్టడంతో ఇద్దరికి తీవ్రగాయాలై ఇద్దరి పరిస్థితి విషమంగా మారిన సంఘటన ముంచంగిపుట్టు మండలంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మండలంలో గల జోలాపుట్టు పంచాయితీ బోండ్రుగూడ గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో బోండ్రుగూడ గ్రామానికి చెందిన కిముడు గోపాల్, బి. పండు అను ఇద్దరు ద్విచక్ర వాహనంపై జోలాపుట్టు బయలుదేరారు. గ్రామం దాటిన కొద్ది సేపటికే గోపాలు ఫిట్స్ రావడంతో బైక్ అదుపు చేయలేకపోయాడు. దీంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయింది. ఆ సమయంలో రోడ్డు పక్కన వ్యవసాయ పనుల నిమిత్తం నడిచి వెళ్తున్న సొబి.రాధ అనే మహిళను బలంగా ఢీ కొట్టారు. దీంతో గోపాల్, రాధకు తీవ్రగాయాలు అయ్యాయి. బైక్ వెనక ఉన్న పండుకు స్వల్ప గాయాలయ్యాయి.
ఈ సంఘటనను గమనించిన స్థానికులు క్షతగాత్రులను ముంచంగిపుట్టు సిహెచ్ సికి తరలించారు. స్థానిక వైద్యాధికారి చంద్రశేఖర్ వైద్య సేవలు అందించారు. ఈ సంఘటన తెలుసుకున్న మండల వైసీపీ నేతలు, సర్పంచ్లు మల్లికార్జున్ జగబందు రమేష్, బాబురావు, కొండలరావులు క్షతగాత్రులను సిహెచ్ సికి వచ్చి పరామర్శించి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. గోపాల్ తలభాగంపై తీవ్రగాయాలు అవడం రాధకు రెండు కాళ్లకు విరిగిపోయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో అంబులెన్స్ లో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు.