పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 25న పార్లమెంటు సమావేశం నిర్వహిస్తున్నట్లు జాతీయ అసెంబ్లీ సచివాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. సభను ఇవాళే సమావేశపర్చాలని ప్రతిపక్షాలు పట్టుబట్టినప్పటికీ........ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో-ఆపరేషన్ శిఖరాగ్ర సదస్సు కారణంగా సమావేశం తేదీని 4 రోజులు ముందుకు పొడిగించారు. సభలో చర్చ తర్వాత 3నుంచి 7రోజుల మధ్య ఓటింగ్ నిర్వహిస్తారు. పాక్ లో ఆర్థిక సంక్షోభం,ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలో ఇమ్రాన్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు అవిశ్వాసతీర్మానం ఇచ్చాయి. 100 మందికిపైగా ప్రతిపక్ష MPలు అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేయగా....ఇమ్రాన్ పార్టీకి చెందిన 24మంది MPలు కూడా మద్దతు ప్రకటించారు. 342మంది సభ్యులున్న పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రధాని ఇమ్రాన్ ను తొలగించాలంటే ప్రతిపక్షాలకు 172మంది ఎంపీల మద్దతు అవసరమవుతుంది. ఇమ్రాన్ పార్టీకి 155మంది ఎంపీల బలముండగా....మరో ఆరు పార్టీలకు చెందిన 23 మంది ఎంపీలు మద్దతు ఇస్తున్నారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించిన తన పార్టీకి చెందిన 24మంది ఎంపీలు మనసు మార్చుకుంటే క్షమించేందుకు సిద్ధమని ఇమ్రాన్ తెలిపారు.