ఎంతో చక్కగా సాగిపోతున్న ప్రపంచాన్ని కోవిడ్ వైరస్ కుదిపేసింది. ఫస్ట్, సెకండ్ వేవ్లో ఎక్కడ చూసినా కరోనా బాధితులు, మరణాలతో ప్రజలు ఎదుర్కొన్న బాధ వర్ణనాతీతం. అయిన వాళ్లు చనిపోయినా కడచూపు కూడా దక్కని పరిస్థితి. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం మన దేశంలో తక్కువగా కేసులు నమోదవుతుండడం ఊరట కలిగిస్తోంది. అయితే అమెరికాలో ఓ కొత్త వైరస్ వెలుగు చూడడం, దానికి మందు కూడా లేదని వైద్యులు చెబుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో హార్ట్ ల్యాండ్ అనే కొత్త వైరస్ను కనుగొన్నారు. ఇది అత్యంత వేగంగా వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. వృద్ధులు, ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలతో ఉన్నవారికి ఇది ప్రాణాంతకమని పేర్కొంటున్నారు. జార్జియాలోని ఎమోరీ విశ్వవిద్యాలయ పరిశోధకులు దీనిపై నివేదికను వెల్లడించారు. వ్యాధి సోకిన వారిలో అంతర్గత అవయవాలన్నీ పనిచేయడం ఆగిపోతాయని, ఫలితంగా ఈ వైరస్ సోకిన వ్యక్తి తక్కువ కాలంలోనే మరణిస్తాడని పేర్కొన్నారు.. దీనిని మొదట తెల్ల తోలు ఉన్న జింకలో గుర్తించారు. అయితే మన ఇళ్లలో ఉండే నల్లులు కూడా ఈ వైరస్ వాహకాలని తేలింది. ఈ వైరస్ వల్ల బాధితులను 50 మందిని గుర్తించారు. హార్ట్ల్యాండ్ వైరస్ 2009లో అమెరికాలోని మిస్సౌరీలో ఇద్దరిలో కనుగొన్నారు. ఆ తర్వాత ఇది అలబామా, ఇల్లినాయిస్, కాన్సాస్, న్యూయార్క్లలోనూ ఉనికిని తెలుసుకున్నారు.