దేశంలో మహిళలకు రక్షణ కరవవుతోంది. ఒంటరిగా ఉన్నా, కుటుంబ సభ్యులతో ఉన్నా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయి కొందరు చేస్తున్న అకృత్యాలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. తాజాగా దేశంలో పిల్లలు చూస్తుండగా ఓ మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
రాజస్థాన్లోని ధోల్పుర్ జిల్లాలో మంగళవారం ఓ దళిత మహిళ తన కుటుంబంతో సహా పొలానికి వెళ్లింది. పనులు పూర్తైన తర్వాత ఇంటికి తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో దారి మధ్యలో ఆరుగురు దుండగులు అటకాయించారు. భర్తను బాగా కొట్టి, గాయపర్చారు. తుపాకీ చూపించి బెదిరించారు. ప్రాణభయంతో అతడు అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఆ తర్వాత పిల్లలు చూస్తుండగా ఆ మహిళపై ఆ దుర్మార్గులు ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటన తర్వాత ఆ మహిళ కుమిలిపోయింది. తర్వాత తేరుకుని, జరిగిన దారుణంపై భార్యభర్తలిద్దరూ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కంచన్పూర్ పోలీసులు విచారణ జరిపి ఆరుగురు నిందితులను గుర్తించారు. దారుణానికి ఒడిగట్టింది లాలూ ఠాకుర్, విపిన్ ఠాకుర్, ధన్సింగ్, సచిన్, మోహిత్, లోకేంద్ర సింగ్ ఠాకుర్లుగా తెలుసుకున్నారు. వారిపై సామూహిక అత్యాచారం, ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్టు కింద కేసు నమోదు చేశారు. అయితే విచారణ జరుపుతున్నామని, ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు వెల్లడించారు.