వివాహ సంబంధాలు నానాటికీ బలహీనమవుతున్నాయి. ఏడడుగులు నడిచి, తాళి కట్టిన భర్తలను కొందరు మహిళలు విడిచిపెడుతున్నారు. పెళ్లయిన కొన్నాళ్లకే ప్రియుడితో కలిసి పరారవుతున్నారు. వివాహ వ్యవస్థకు కళంకం తీసుకొస్తున్నారు. తాజాగా ఓ మహిళ పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారాన్ని దాచింది. పెళ్లైన నెలకే భర్తకు షాకిస్తూ, ప్రియుడితో ఎటో వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా వేంగికాల్ గ్రామానికి చెందిన యువతికి, గ్రామానికే చెందిన యువకుడితో వివాహమైంది. ఈ పెళ్లిని పెద్దలు కుదిర్చారు. ఆ సమయంలో తనను చేసుకోబో వ్యక్తికి పెళ్లి ఇష్టమేనని ఆ యువతి చెప్పింది. అయితే పెళ్లి అయ్యాక ఆమె తన భర్తతో ఎక్కువగా మాట్లాడేది కాదు. కొన్నాళ్లకు అంతా సర్దుకుంటుందని ఆమె భర్త భావించాడు. అయితే మంగళవారం ఉన్నట్టుండి ఆ యువతి ఇంటి నుంచి పరారైంది. దీంతో ఆమె భర్త, బంధువులు ఆమె కోసం విపరీతంగా గాలించారు. తెలిసిన వారి ఇళ్లలోనూ, బంధువుల వద్ద ఆచూకీ కోసం ఆరా తీశారు. ఈ దశలో పెళ్లికొడుకుపై కొందరు అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఈ తరుణంలో అందరికీ షాక్ ఇస్తూ ఆ యువతి పోలీసుల వద్దకు వచ్చింది. తాను ప్రేమించిన వ్యక్తిని రెండో వివాహం చేసుకున్నానని, అతడితోనే కలిసి జీవిస్తానని స్పష్టం చేసింది. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది. ఈ ఘటనతో బంధువులంతా అవాక్కయ్యారు. ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకోవాలని సూచిస్తూ వారిని పోలీసులు పంపించి వేశారు.