విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటం మొదలై రేపటికి 400వ రోజుకు చేరుకుంటుంది. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సంఘం అధ్యక్షుడు అయోధ్య రామ్ ఈ రోజు విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అప్పగించకూడదని వైసీపీ, టీడీపీ నేతలే కాకుండా అనేక పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. ఇటీవల తాము సభ నిర్వహిస్తే జనసేన పార్టీ నేతలు అందులో పాల్గొనలేదని, అయితే జనసేన ఆవిర్భావ సభ ఉన్న నేపథ్యంలోనే ఆ పార్టీ నేతలు రాలేదని అయోధ్య రామ్ తెలిపారు. బీజేపీతో జనసేన భాగస్వామ్యమైనప్పటికీ తమకు పవన్ కల్యాణ్ మద్దతు తెలిపారని ఆయన అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తాము ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయాలని చూస్తే బీజేపీ దీపం ఆరిపోవడం ఖాయమని అయోధ్య రామ్ వ్యాఖ్యానించారు. అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని ఆయన కోరారు. 100 మంది ఎంపీల సంతకాలతో ఢిల్లీ వెళ్లి పోరాడతామని తెలిపారు. స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామనే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఇదే డిమాండ్తో ఈ నెల 28న విశాఖ బంద్కు పిలుపు నిస్తున్నట్లు చెప్పారు. తాము పలువురు బీజేపీ నేతలను కూడా కలిశామని ఆయన తెలిపారు. తమకు సానుకూలంగా మాట్లాడుతూనే తమ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వెళ్లలేమని బీజేపీ నేతలు చెప్పారని ఆయన అన్నారు. తమకు అన్ని పార్టీల నుంచి మద్దతు వస్తోందని అయోధ్య రామ్ తెలిపారు.