తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన తిరుమల ఆర్జిత సేవ టిక్కెట్లను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. 3 నెలలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుండి భక్తులకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన మరియు నిజ పాద దర్శనం మొదలగు ఆర్జిత సేవ టిక్కెట్లు ఎలక్ట్రానిక్ లాటరీ పద్ధతి ద్వారా కేటాయించనున్నారు. ఈనెల 20 వ తేదీ ఉదయం 10 గంటల నుండి 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు 2 రోజుల పాటు కేటాయిస్తారు.
కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవ మొదలగు ఆర్జిత సేవ టిక్కెట్లను ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుండి మొదటిగా బుక్ చేసుకున్న వారికి మొదటిగా (FIFO పద్ధతిన) కేటాయించడం జరుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. స్వామివారి ఆర్జిత సేవలను కోరుకునే భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.