ఉత్తర్ప్రదేశ్ లోని బస్తీ జిల్లాలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన పసిబిడ్డను కన్నతల్లే భూమిలో పాతిపెట్టి వెళ్లిపోయింది. ఆస్పత్రి ఆవరణలో మట్టిలో కనిపించిన చిన్నారిని స్థానికులు కాపాడారు. శరీరంలో సగభాగం మట్టిలో మిగిలిన భాగం భూమిపైన కనిపించిందని వారు చెప్పారు. శిశువు ఏడుపు విన్న ఓ మహిళ ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలోని పోలీసులకు సమాచారం అందించింది. అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. చిన్నారిని మట్టిలో నుంచి బయటకు తీసి ఆస్పత్రిలోని పిల్లల వార్డుకు తరలించారు. జిల్లా ఆస్పత్రి పిల్లల వైద్యురాలు, ఇతర వైద్య సిబ్బంది శిశువుకు వైద్యం అందించారు. చిన్నారి ప్రస్తుతం క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. చిన్నారి తల్లి కోసం పోలీసులు గాలిస్తున్నారు. చిన్నారిని శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు.