రోడ్డు బాగలేకపోతే తిట్టుకుంటూ నెమ్మదిగా వెళ్లే వారు కొత్త రోడ్డు వేసేసరికి కన్ను మిన్ను కాకుండా వాహనాలను నడుపుతున్నారు. రావులపాలెం నుండి కొత్తపేట వెళ్లే రోడ్డులో పెంకుల పాటి గురువు సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదమే ఇందుకు ఉదాహరణ. కొత్తపేట వైపునుంచి రావులపాలెం వైపు కొబ్బరి పొట్టు లోడుతో వెళుతున్న ట్రాక్టర్ అతివేగంగా వెళుతూ ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి పల్టీ కొట్టింది.
ఈ సంఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. కానీ ఈ సంఘటనను చూసిన వారు వాహనాల రాకపోకలు పై విమర్శల వర్షం కురిపించారు. కొత్తగా రోడ్డు వేసిన తరువాత వాహనాల స్పీడుకు బ్రేకులు లేకుండా పోయాయని వ్యాఖ్యానిస్తున్నారు. కొత్తపేట నియోజకవర్గంలో మట్టి, ఇసుక లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్ల రవాణా ఎక్కువైంది. దీనితో వాహనాల రద్దీ పెరిగింది. వాహనాలు అతివేగంగా తిరగడంతో ద్విచక్రవాహన దారులు, ప్రయాణికులు రోడ్డు పై ప్రయాణించడానికి భయపడిపోతున్నారు. వాహనాల అతివేగానికి అధికారులు కళ్లెం వేయాలని వాహనదారులు కోరుతున్నారు.