కరోనా కథ ముగిసినట్టేనంటూ ఊపిరి పీల్చుకుంటున్న ప్రపంచాన్ని మరోసారి ఉలిక్కిపడేలా చేస్తోంది మహమ్మారి. ఒకవైపు చైనాలో కేసుల సంఖ్య రెండేళ్ల గరిష్ఠానికి చేరుకోగా మరోవైపు దక్షిణ కొరియాలో భారీగా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. బుధవారం ఆ దేశంలో 4 లక్షల కొత్త కేసులు నమోదు కాగా ఒక్క రోజులోనే 55 శాతానికి పైగా కేసులు పెరిగాయి. గురువారం 6,21,328 కొత్త కేసులు వెలుగు చూశాయి. కొరియా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ ఈ మేరకు గణంకాలు విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 429 మంది కరోనాతో మరణించినట్టు ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 82,50,592కు చేరింది. అంతకుముందు రోజు 293 మంది కరోనాకు బలయ్యారు. రోజువారీ కొత్త కేసులన్నవి వైద్య నిపుణుల అంచనాల కంటే ఎక్కువగా ఉన్నాయి. మార్చి మధ్య నాటికి కరోనా కేసులు గరిష్ఠానికి చేరుకుంటాయని అక్కడి ప్రభుత్వం అంచనా వేసింది. గరిష్ఠంగా 2,70,000 వరకు కేసులు రావచ్చని భావించగా దానికి రెట్టింపు దాటిపోయాయి. కేసుల సంఖ్య భారీగా నమోదైనా.. రానున్న రోజుల్లో భౌతిక దూరం సహా అన్ని రకాల సామాజిక నియంత్రణలను ఎత్తివేయాలన్న ప్రణాళికలను పక్కన పెట్టే ఉద్దేశ్యం ఏదీ సర్కారుకు లేదని తెలుస్తోంది.