కేరళ రాష్ట్రం వాయనాడ్లోని బనాసురా జలాశయంలో దేశంలోనే అతిపెద్ద తేలియాడే సౌరశక్తి విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కేరళ రాష్ట్ర విద్యుత్ బోర్డు (కేఎస్ఈబీ) రూ.9.25 కోట్లు వెచ్చించి నిర్మించిన ఈ విద్యుత్ కేంద్రం సామర్థ్యం 500 కేడబ్ల్యూపీ (కిలోవాట్ పీక్). జలాశయం నీటిపై 6 వేల చదరపు మీటర్ల పరిధిలో విద్యుత్ కేంద్రం తేలియాడుతూ ఉంటుంది. 18 తేలియాడే ప్లాట్ఫారమ్లపై సోలార్ వోల్టాయిక్ ప్యానెళ్లను ఇన్స్టాల్ చేశారు. 2016 మార్చిలో ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు పనులు ఇటీవలే పూర్తయ్యాయి. విద్యుత్ కేంద్రం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది అని కేఎస్ఈబీ పరిశోధన, డ్యాం సేఫ్టీ ఉపవిభాగం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పీ మనోహరన్ తెలిపారు. 500 కేడబ్ల్యూపీ సామర్థ్యం కలిగిన ఈ సౌర విద్యుత్ కేంద్రం దేశంలోనే అతి పెద్దదని, వచ్చేనెలలో కేరళ సీఎం పినరాయి విజయన్ దీనిని ప్రారంభిస్తారని కేఎస్ఈబీ అధికారులు తెలిపారు. ఆడ్టెక్ సిస్టమ్స్ లిమిటెడ్ అనే సంస్థ ఈ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించింది. దీని వార్షిక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7.5 లక్షల యూనిట్లు. ఆర్థిక, రక్షణ కారణాలతో జలాశయం నీటిపై 11కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని నిర్మించాం. నేలపై నిర్మించే సౌర విద్యుత్ కేంద్రాలతో పోలిస్తే నీటిపై తేలియాడే కేంద్రాలే అధిక సామర్థ్యంతో పనిచేస్తాయి అని ఆడ్టెక్ సిస్టమ్స్ లిమిటెడ్ ఉపాధ్యక్షుడు (ప్రాజెక్టులు) రవీంద్రన్ టీ నాయర్ తెలిపారు.