దేశంలో ఇవాళ ముఖ్యమైన రోజు అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇవాళ్టి నుంచి 12–14 ఏళ్ల పిల్లలకూ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైందని, 60 ఏళ్ల పైబడిన వారందరికీ ప్రికాషన్ డోసులు వేయడం మొదలుపెట్టామని చెప్పారు. భారత వ్యాక్సినేషన్ కార్యక్రమం చాలా శాస్త్రీయమైనదని చెప్పారు. ప్రజలను కాపాడేందుకు, మహమ్మారిపై పోరును ఉద్ధృతం చేసేందుకు 2020లోనే వ్యాక్సిన్ల తయారీపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారని ఆయన అన్నారు.
కష్టకాలంలో శాస్త్రవేత్తలు, ప్రైవేట్ కంపెనీలు చాలా బాగా పనిచేశారని కొనియాడారు. వ్యాక్సిన్ తయారీ తొలినాళ్లలో తాను మూడు సంస్థలను పరిశీలించానని, వారు వ్యాక్సిన్ ను ఎలా తయారు చేస్తున్నారో తెలుసుకోగలిగానని తెలిపారు. 2021 జనవరిలో వైద్యులు, వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ను మొదలుపెట్టామని గుర్తు చేశారు. కరోనా పోరులో ముందున్న వారికి రక్షణ ఉండాలన్న ఉద్దేశంతోనే ముందుగా వారికి కరోనా టీకాలను ఇచ్చామన్నారు. మిగతా దేశాల్లో చాలా మంది వ్యాక్సిన్లు వేసుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటే.. మన దేశంలో మాత్రం అందరూ ముందుకు వచ్చారని, అందరూ టీకా తీసుకోవాలని ఎదుటి వారిని ప్రోత్సహించారని మోదీ గుర్తు చేశారు. అది చూసి తన మనసు ఉప్పొంగిపోయిందని అన్నారు.