దేశంలో వాహన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం నానాటికీ కఠినతరం చేస్తోంది. తాజాగా పాతవాహనాలకు రీ రిజిస్ట్రేషన్ కోసం విధించే ఛార్జీలను భారీగా పెంచింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటన జారీ చేసింది. వాహనాల తుక్కు విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం ప్రోత్సాహకాలను ప్రకటించింది. రిజిస్టర్డ్ వెహికిల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ నుంచి పాత వాహన తుక్కు ధ్రువీకరణ పత్రాన్ని పొందినవారు కొత్త వాహనం కొంటే రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం- 15 ఏళ్లు దాటిన వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్ను ఐదేళ్లకోసారి రెన్యువల్ చేయించాలి. ఎనిమిదేళ్లు దాటిన తర్వాత తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత వాహనాల రీ-రిజిస్ట్రేషన్ ఆలస్యమైతే నెలకు రూ.300 చొప్పున, వాణిజ్య వాహనాలైతే రూ.500 చొప్పున జరిమానా చెల్లించాలి. రీ రిజిస్ట్రేషన్కు ద్విచక్రవాహనాలకు రూ.1000, కారుకు రూ.5 వేలు, ఇంపోర్టెడ్ కారుకు రూ.40 వేలు చెల్లించాల్సి ఉంటుంది. రవాణా వాహనాలకు ఫిట్నెస్ పరీక్షల రుసుమును కూడా ఖరారు చేశారు. ట్యాక్సీలకు రూ.7 వేలు చెల్లించాలి. బస్సులు, లారీలకు రూ.12,500లు చెల్లించాలి. ఈ చార్జీలన్నీ ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు కానున్నాయి.