వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం మైదుకూరు పట్టణం నందు చిరు వ్యాపారి టీవీఎస్ స్కూటర్ పై చాపల వ్యాపారం చేస్తూ, తన కుటుంబాన్ని అదే బండి పై తీసుకెళుతున్న దృశ్యం పలువురికి కంటపడింది. ఈ దృశ్యాలను గమనించిన ప్రముఖ కవి మల్లేశ్వరరావు ఆకుల ఇలా వర్ణించాడు.
ఒంటరిగా జంటగా ఆలుమగలు ఒడిలో బిడ్డతో సంసార నావ వాళ్లది. సంపాదించిన మూటలు లేవు. కష్టాలను చాపచుట్టి ఎప్పటికప్పుడు బతుకు పోరులో వెనుకబడి పోకుండా ముందుకు మునుముందుకు బతుకు పోరాటం ముఖంలోని మందహాసాన్ని మాయం చేసింది. ఈదడమో, మునక వేయడమో తప్ప మరో మార్గం లేనప్పుడు బతుకు ఈతమీదనే దృష్టి.
ఏరోజుకారోజు తాడు మీద కర్ర చేతబట్టి తూకంగా నడిచినంత సాహస క్రీడ. కాళ్ళ తడి ఆరే లోగా నిప్పుల మీద నడిచిపోవాలి. కంటతడి కనబడకుండా జీవితం గడిపేయాలి. కొన్ని బతుకులెంత గడ్డుగా సాగిపోతుంటాయో బతుకు చిత్రాల్ని చూపే బాట మీద. నిబ్బరంగా నడిచి పోవడానికి ధ్రుఢ నిశ్చయమనే ఏతంపట్టి ఎప్పటి నీరు అప్పుడే తోడేయాలి. గడకర్రతో నెట్టుకుంటూ ఏరు దాటి ఒడ్డుకు చేరాలి.