బెంగళూర్ : అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి అగ్ర నాయకత్వమే కాకుండా ఆయా రాష్ట్రాల ఎంపీలతో పాటు పార్టీ నేతలందరూ బాధ్యత వహించాలని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఇటీవల వెల్లడైన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో పార్టీ పరాజయానికి మనం సోనియా గాంధీ ఒక్కరినే బాధ్యులుగా చేస్తూ మాట్లాడుతున్నామని ఈ ఓటమికి కేవలం గాంధీ కుటుంబమే కాదు..ప్రతి రాష్ట్ర నేత, ఎంపీ బాధ్యులని ఖర్గే స్పష్టం చేశారు.సోనియా నాయకత్వం పట్ల విశ్వాసం వ్యక్తం చేశామని, ఆమె రాజీనామా చేసే ప్రశ్న ఉత్పన్నం కాదని అన్నారు. మార్చి 10న ప్రకటించిన పంజాబ్, గోవా, యూపీ, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
ఆదివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరిగిందని చెప్పారు. బీజేపీతో పాటు ఆ పార్టీ సిద్ధాంతాలతో తాము పోరాడుతామని, రానున్న ఎన్నికల్లో తాము మరింత మెరుగైన ఫలితాలు రాబడతామని ఖర్గే ఆశాభావం వ్య్తం చేశారు.