దేశంలో యూపీఐ చెల్లింపుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. దీన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చే దిశగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. డెబిట్ కార్డు లేని వారికి కూడా యూపీఐ పిన్ సెట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఆధార్ నంబర్, ఓటీపీ ద్వారా పిన్ సెట్ చేసుకునే వెసులుబాటు కల్పించాల్సిందిగా బ్యాంకులకు సూచించింది. దీనికి సంబంధించి గత ఏడాదే సర్క్యులర్ జారీ చేసిన ఎన్పీసీఐ.. ఇందుకు డిసెంబరు 15 వరకు గడువు విధించింది. కానీ, బ్యాంకులు ఆలోపు చర్యలు తీసుకోలేక పోవడంతో ఈ గడువును తాజాగా ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ఇప్పటివరకు యూపీఐ పిన్ సెట్ చేసుకోవాలంటే డెబిట్ కార్డు తప్పనిసరి. అందులోని చివరి ఆరు అంకెలను తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కానీ, దేశంలో ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది బ్యాంకు ఖాతాదారులకు డెబిట్ కార్డులు లేవు. ఇలాంటి వారు ఇప్పుడు ఆధార్ నంబరు, ఓటీపీ ద్వారా యూపీఐ పిన్ సెట్ చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా యూపీఐ వినియోగదారుల సంఖ్య మరింత పెరుగుతుందని ఎన్పీసీఐ ఆశిస్తోంది.