కృష్ణా జిల్లా: గంపలగూడెం మండలం గుళ్లపూడి గ్రామ డ్వాక్రా సంఘాల మహిళలు శుక్రవారం గంపలగూడెం భారతీయ స్టేట్ బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగారు. 4 సంవత్సరాల క్రితం గుళ్లపూడి లో వెలుగు సి సి, బుక్ కీపర్ కలసి డ్వాక్రా గ్రూప్ లకు మంజూరైన నిధులను సుమారు 53 లక్షల మేర గోల్ మాల్ చేసిన సంఘటనలో ఎన్ని సార్లు అధికారులు విచారణ జరిపిన తమనుంచి డబ్బులు రికవరీ చేయాలనీ నిర్ణయించడంతో డ్వాక్రాగ్రూప్ సభ్యులు తమకు న్యాయం చేయాలనీ బ్యాంకు ను ముట్టడించారు. గతం లో బ్యాంకు అధికారులు ఇచ్చిన హామీ మేరకు 12 గ్రూపులకు వన్ టైం సెటిల్మెంట్ చేస్తామని చెప్పినా ఏడు గ్రూపులకు మాత్రమే వర్తింపచేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. బ్యాంకు ఖాతాలో ఉన్న పొదుపు సొమ్మును బ్యాంకు అధికారులు తమ అనుమతి లేకుండా లోన్ బకాయి కి జమ చేసుకోవడంతో 5 గ్రూపులకు వన్ టైం సెటిల్మెంట్ అవకాశం లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు. ఈ అక్రమాలకు బాధ్యులైన వెలుగు సిబ్బంది పైన, బ్యాంకు అధికారుల పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుని తమకు సంబంధం లేని బకాయిల నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నారు.