పొద్దుతిరుగుడు పువ్వు పంట సాగుచేస్తే రైతులకు మంచి ఆదాయం ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రపంచ దేశాలకు సన్ఫ్లవర్ నూనె సరఫరా చేసే దేశాల్లో ఉక్రెయిన్ టాప్ ప్లేస్ లో ఉంది. అక్కడ ఏటా కోటి టన్నుల సన్ఫ్లవర్ పండుతుంటే, వాటి నుంచి 40 లక్షల టన్నుల నూనె ఉత్పత్తి అవుతోంది. అక్కడి ప్రజలు 6 లక్షల టన్నులే వాడుతున్నారు. మిగిలింది విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఉక్రెయిన్ ఉత్పత్తిలో 27 శాతం నూనె భారత దేశానికే వస్తోంది. ఏటా మనదేశంలోని పంటతో 60 వేల టన్నుల సన్ఫ్లవర్ నూనె మాత్రమే ఉత్పత్తి అవుతోంది. దీంతో ఈ నూనె కోసం దిగుమతులపైనే అధికంగా ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో వానాకాలం, యాసంగి కలిపి 3 కోట్ల ఎకరాలకు పైగా పంటలు సాగవుతున్నాయి. నూనె గింజల సాగును 2 సీజన్లలో అరకోటి ఎకరాల్లో చేపట్టవచ్చని ఆయిల్ఫెడ్ ఎండీ సురేందర్ చెప్పారు. ఇందువల్ల భారత్ ఏటా దిగుమతి చేసుకుంటున్న 25 లక్షల టన్నుల సన్ఫ్లవర్ నూనెను ఇక్కడే ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు. సన్ ఫ్లవర్ సాధారణ విస్తీర్ణం 801 ఎకరాలైతే, తెలంగాణలో గత వానాకాలంలో 282 ఎకరాల్లోనే సాగు చేశారు. నూనెగింజల సాగు సాధారణ విస్తీర్ణం 3.70 లక్షల ఎకరాలైతే ప్రస్తుత యాసంగిలో 35,940 ఎకరాల్లోనే చేస్తున్నారు.
గిట్టుబాటు కావడం లేదంటూ భారత్ లో సన్ ఫ్లవర్ సాగును రైతులు తగ్గించేశారు. దేశీయంగా హెక్టారుకు సగటున 7 క్వింటాళ్లలోపే ఈ పంట దిగుబడి వస్తోంది. ప్రస్తుతం వినియోగం పెరిగింది కాబట్టి ఈ పంటను సాగుచేస్తే రైతులకు ఆదాయం బాగుంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.