ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాడు కమెడియన్‌.. నేడు సీఎం

national |  Suryaa Desk  | Published : Fri, Mar 11, 2022, 11:33 AM

ఒకప్పుడు కమెడియన్‌ గా జనాల్ని నవ్వించిన ఆయన నేడు ఓ రాష్ట్రానికి సీఎం అయ్యారు. తాగుబోతు అని విమర్శలను ఎదుర్కొన్న ఆయనే ఇప్పుడు ప్రజలు మెచ్చిన నాయకుడయ్యారు. ఆయనే పంజాబ్‌ రాష్ట్రానికి కాబోయే సీఎం, ఆప్‌ నేత భగవంత్‌ మాన్‌. కమెడియన్‌ నుంచి సీఎంగా మాన్ ప్రయాణం ఎలా సాగిందో ఇప్పుడు తెలుసుకుందాం.


భగవంత్‌ మాన్‌ 1973 అక్టోబరు 17న పంజాబ్‌లోని సంగ్రూర్‌ జిల్లాలో జన్మించారు. షహీద్‌ ఉధమ్‌సింగ్‌ ప్రభుత్వ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. ఆయన కాలేజీ రోజుల్లో యూత్‌ కామెడీ ఫెస్టివల్స్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత అదే కెరీర్‌గా ఎంచుకున్నారు. రాజకీయాలు, బిజినెస్‌, క్రీడల వంటి అంశాలపై తనదైన శైలిలో జోకులు వేసేవారు. ఆయన చేసిన 'జుగ్ను కెహెందా హై', 'జుగ్ను మస్త్‌ మస్త్‌' వంటి టీవీ ప్రోగ్రామ్‌లు ఎంతో పాపులర్‌ అయ్యాయి. ముద్దుపేరు 'జుగ్ను'గా ప్రజల్లో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 2008లో 'ది గ్రేట్‌ ఇండియన్‌ లాఫ్టర్‌ ఛాలెంజ్‌'తో ఎంతగానో పేరుతెచ్చుకున్నారు. పలు సినిమాల్లోనూ నటించి మెప్పించారు.


అలా కమెడియన్‌గా ఎంతో గుర్తింపు సాధించిన భగవంత్‌ మాన్‌ 2011లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ పంజాబ్‌లో చేరి 2012 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో 2లక్షల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2017లో జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మాన్‌ ఓడిపోయారు. దీంతో 2019 లోక్‌సభ ఎన్నికల్లో తిరిగి సంగ్రూర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. లోక్‌సభలో ప్రస్తుతం ఆమ్‌ ఆద్మీ పార్టీ తరఫున ఉన్న ఏకైక ఎంపీ కూడా ఈయనే. తాజా ఎన్నికల్లో ఆయన ధురి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. గురువారం వచ్చిన ఎన్నికల ఫలితాల్లో పంజాబ్‌లో ఆప్‌ ప్రభంజనం సృష్టించింది. ఊహించని విధంగా అత్యధిక స్థానాల్లో గెలిచి అధికారం చేప్పట్టబోతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com