నేటినుంచి జరగాల్సిన ఇంటర్ ప్రయోగ పరీక్షల్ని వాయిదా వేస్తూ బోర్డు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ ప్రయోగ పరీక్షలు జంబ్లింగ్ విధానంలో నిర్వహించాలని ఇంటర్ బోర్డు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తొలుత నాన్ జంబ్లింగ్ విధానంలో పరీక్షలు ఉంటాయని ఉత్తర్వులు జారీచేసిన ఇంటర్ బోర్డు పరీక్షలకు కొద్దిరోజుల ముందు మరలా జంబ్లింగ్ విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తామని చెప్పింది.
దీని పట్ల అభ్యంతర వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ జూనియర్ కళాశాలల మేనేజ్మెంట్స్ అసోసియేషన్(ఏపీజేఎంఏ) హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు స్టే ఉత్తర్వులు మధ్యాహ్నం ఇంటర్ బోర్డు అధికారులకు అందడంతో పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరలా ఎప్పుడు నిర్వహించేది త్వరలో షెడ్యూల్ ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. కాగా జిల్లాలో ఈ ఏడాది ఇంటర్ ప్రయోగ పరీక్షలకు 44, 407 మంది విద్యార్థులు హాజరుకాన్నారు. ఇందులో బైపీసీ విద్యార్థులు 7, 821 మందికాగా, ఎంపీసీ విద్యార్థులు 36, 586 మంది ఉన్నారు.