న్యూఢిల్లీ: చోరీకి గురైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కారు దొరికింది. ఇవాళ ఉదయం ఘజియాబాద్లో ఆ కారును గుర్తించారు. రెండు రోజుల క్రితం ఢిల్లీ సచివాలయం నుంచి కేజ్రీకి చెందిన బ్లూ వాగన్ ఆర్ కారు చోరీకి గురైంది. ఆ కారును ముద్దుగా ఆప్ మొబైల్ అని పిలుస్తారు. సీఎం కారు చోరీకి గురికావడంతో అదో సంచలనంగా మారింది. కేజ్రీ కారును ఢిల్లీ పోలీసులకు అందించనున్నట్లు ఘజియాబాద్ పోలీసులు తెలిపారు. కారు ఎత్తుకెళ్లిన ఘటన తర్వాత సీఎం కేజ్రీవాల్.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్కు లేఖ రాశారు. దేశ రాజధానిలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆయన.. తన లేఖలో గవర్నర్కు ఫిర్యాదు చేశారు. నా కారు ఎత్తుకెళ్లడం పెద్ద విషయం కాదు.. కానీ అది ఢిల్లీ సచివాలయం నుంచి దొంగలించడమంటే.. నగరంలో లా అండ్ ఆర్డర్ లేనట్లే అని సీఎం కేజ్రీవాల్ అన్నారు.