టెస్టు సారథిగా తొలి మ్యాచ్లోనే శ్రీలంకపై అఖండ విజయాన్ని అందుకున్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఆ మ్యాచ్లో భారత్ కేవలం 3 రోజుల్లోనే విజయం సొంతం చేసుకుంది. ఈ క్రమంలో టెస్టు విజయానికి కారణమైన జడేజా, అశ్విన్లపై హిట్మ్యాన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా అశ్విన్ను పొగడ్తల్లో ముంచెత్తాడు. శ్రీలంకతో జరిగిన టెస్టులో భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ సాధించిన 434 వికెట్ల రికార్డును అశ్విన్ తిరగరాశాడు. 435 వికెట్లు సాధించి వార్తల్లో నిలిచాడు. దీనిపై స్పందిస్తూ మ్యాచ్లో అశ్విన్ మొత్తంగా ఆరు వికెట్లు పడగొట్టడం అద్భుతమని రోహిత్ శర్మ అన్నాడు. తన దృష్టిలో అశ్విన్ ఆల్ టైమ్ గ్రేట్ అని, జట్టులో ఎప్పుడూ కీలక ఆటగాడేనని చెప్పాడు. దీనిని పాక్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ వ్యతిరేకించాడు. రోహిత్ శర్మ వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదని తెలిపాడు. అశ్విన్ కేవలం స్వదేశంలోనే వికెట్లు సాధిస్తాడని, విదేశాల్లో ఆయనకు పేలవ రికార్డు ఉందని అన్నాడు. అశ్విన్ కంటే కుంబ్లే, బిషన్ సింగ్ బేడీ గొప్ప బౌలర్లని అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లను ప్రోత్సహించే క్రమంలో రోహిత్ ఆ వ్యాఖ్యలు చేసుంటాడని అన్నాడు.