ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పదో తరగతి, ఇంటర్ కోర్సులకు మే 2 నుంచి పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు మంత్రి ఆదిమూలపు సురేష్ సోమవారం షెడ్యూల్ ను విడుదల చేశారు. ఈ పరీక్షలు మే 11వ తేదీ వరకు జరగనున్నాయి. ఇంటర్ జనరల్, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షలు మే 13 నుంచి 17 వరకు ఆదివారంతో సహా జరుగుతాయని మంత్రి వెల్లడించారు.
హాల్టికెట్లో నిర్దేశించిన సబ్జెక్టులకు సరైన ప్రశ్నపత్రం తీసుకోవాలని, అలా కాకుండా వేరొక ప్రశ్నపత్రం తీసుకొని పరీక్ష రాస్తే ఫలితాన్ని రద్దు చేస్తామని చెప్పారు. దీనికి సంబంధిత విద్యార్థులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. విద్యార్థులు తమకు నిర్దేశించిన కేంద్రంలోనే పరీక్షకు హాజరవ్వాలని ఓపెన్ స్కూల్ సొసైటీ సంచాలకుడు కె.వి.శ్రీనివాసులు రెడ్డి స్పష్టం చేశారు.