కడప జిల్లా సుండుపల్లి మండలంలో బుధవారం రాత్రి భారీ వర్షాలు కురవడంతో మండలంలోని పలు వంకలు, వాగులు ఉద్ధృతంగా ప్రవహించి బాహుదానదిలో కలుస్తున్నాయి. దీంతో బాహుదానదిలో నీటిప్రవాహం పెరిగి బెస్తపల్లె సమీపంలో ఉన్న తాత్కాలిక వంతెన తెగిపోయింది. ఆ సమయంలో వంతెనపై ఓ ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రయాణికులను రక్షించి బస్సును జేసీబీ, ఇటాచీ ద్వారా ఒడ్డుకు చేర్చారు.
మండలంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సుండుపల్లి, మడితాడు గ్రామాల చెరువులు నిండి అలుగులు ప్రవహిస్తున్నాయి. మద్దెలవంక, గూనేటివాగువంక, కంచిపాటివాన్లపల్లివంక, చాకలివంక ఉద్ధృతంగా ప్రవహించి బాహుదానదిలో కలుస్తున్నాయి. దీంతో నీటిప్రవాహం పెరిగి వై.ఆదినారాయణరెడ్డి పించా జలాశయంలోకి నీటి ప్రవాహం పెరిగింది. గురువారం ఉదయం 8గం.ల నుంచి 3100 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నామని సిబ్బంది తెలిపారు. చిత్తూరు జిల్లా పీలేరు, సదుం ప్రాంతాల్లో బుధవారం రాత్రి భారీ వర్షాలు కురవడం, సదుం పరిధిలో మూడు చెరువులు తెగడంతో పీలేరునదిలో నీటిప్రవాహం పెరిగిందని పించా సిబ్బంది పేర్కొన్నారు. ఆ నీటి ప్రవాహానికి అనుగుణంగా జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. పించా, బాహుదా నదీపరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.