ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని తెలిపారు. ఇది పార్లమెంటులో చేసిన విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారన్నారు. ఈ విషయం పార్లమెంట్, న్యాయస్థానానికి తెలుసన్నారు. ఏపీలో రాజధాని వివాదం అంశంపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల అంశాన్ని కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు తీసుకున్న నిర్ణయంతో అధికార పార్టీ ఆగ్రహంతో ఉంది. రాజ్యాంగ స్పూర్తిని కోర్టులు గౌరవించాలని, శాసన వ్యవస్థలో తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించడం తగదని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఎటువంటి వివాదం లేదు. అయితే తాజాగా బొత్స కొత్త చర్చకు తెరలేపారు. దీంతో ఇరు రాష్ట్రాల నేతల మధ్య రాజకీయ విమర్శనాస్త్రాలు సంధించుకునే అవకాశం ఉంది. బొత్స వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు స్పందించారు. వైసీపీ సర్కారు రాజధాని హైదరాబాద్ అనుకుంటే అక్కడి నుంచే పరిపాలన చేయాలని సూచించారు.