వికేంద్రీకరణతోనే ఏపీ అభివృద్ధి సాధ్యపడుతుందని గవర్నర్ విశ్వభూషన్ పేర్కొన్నారు. సోమవారం ఏపీ అసెంబ్లీ, కౌన్సిల్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. ఉగాది నుంచి కొత్తగా ప్రకటించిన జిల్లాల్లో పాలన ప్రారంభమవుతుందన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించామన్నారు. ఇందుకు గ్రామ, వార్డు సచివాలయాలు ఎంతో దోహదపడుతున్నాయన్నారు. రైతులు, మహిళలు, బడుగు, బలహీన వర్గాలను ఏపీ ప్రభుత్వం ఆదుకుందన్నారు. ఉద్యోగుల పదవీ విరమణ గడువును 60 నుంచి 62 ఏళ్లకు పెంచామని చెప్పారు. నాడు-నేడు, అమ్మ ఒడి, జగనన్న గోరు ముద్ద, జగనన్న తోడు, వైఎస్ఆర్ వాహన మిత్ర, జగనన్న చేదోడు, జగనన్న వసతి దీవెన పథకాలకు కేటాయింపులను వివరించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. అయితే గవర్నర్ ప్రసంగం మధ్యలోనే టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. అంతకు ముందు సభలో గవర్నర్ ప్రసంగం ప్రతులను చింపి వేశారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ హక్కులను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.