ఉక్రెయిన్ తీసుకున్న ఓ నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రష్యాతో ఇటీవల రెండు దఫాలు శాంతి చర్చలు జరిగాయి. అందులో ఉక్రెయిన్ ప్రతినిధిగా డెనిస్ కిరీవ్ పాల్గొన్నారు. అయితే ఉక్రెయిన్ సీక్రెట్ సర్వీస్ ఆయనను శనివారం కాల్చి చంపింది. ఆయన ఒక గూఢచారి అని, అరెస్టుకు అంగీకరించకపోవడంతో చంపినట్లు పార్లమెంట్ సభ్యులు పేర్కొన్నారు. అయితే ఆయన మరణం తర్వాత ఉక్రెయిన్ రక్షణ శాఖ హీరోగా కిరీవ్ను అభివర్ణించింది. దీనిపై ప్రపంచ దేశాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. గత వారం రష్యాతో చర్చలో ఉక్రెయిన్ బృందంలో కిరీవ్ ఉన్నారు. అయితే అధికారికంగా పాల్గొనే బృందంలో ఆయన పేరు మాత్రం లేదు. అయినప్పటికీ సమావేశంలో ఆయన ఏ హోదాలో పాల్గొన్నారో తెలియలేదు. తాజాగా ఆయన మరణంపై ఉక్రెయిన్, రష్యా పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. ఆయన మీ దేశం తరుపున పని చేస్తున్నారని ఉక్రెయిన్, రష్యా ఆరోపణలు చేస్తున్నాయి.