దివంగత పరిటాల రవి, మంత్రి పరిటాల సునీతల కుమారుడు శ్రీరామ్ వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరైన సంగతి తెలిసిందే. కేసీఆర్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు క్లాస్ పీకారు. ఈరోజు అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, కేసీఆర్ అనంతపురం వచ్చినప్పుడు మనవాళ్లు తొందరపడి ప్రవర్తించారని అన్నారు. పొరుగు రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి వచ్చినప్పుడు... వారిని గౌరవంగా పంపించాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. పయ్యావుల కేశవ్ తో కేసీఆర్ రహస్య మంతనాలు అంటూ అనవసరంగా గందరగోళం సృష్టించారని అన్నారు. ఇలాంటివన్నీ పార్టీకి ఎంతవరకు అవసరమో అందరూ ఒకసారి ఆలోచించాలని సూచించారు.