జమ్ము: మగవారి తోడు లేకుండా ముస్లిం మహిళలు బహిరంగ ప్రదేశాలకు వెళ్లకూడదంటూ కిష్వర్ జిల్లాలోని ఓ ఇస్లామిక్ సంస్థ ఆదేశాలు జారీ చేసింది. సర్కస్లు, ఎగ్జిబిషన్ల వంటి కార్యక్రమాలకు మగతోడు లేకుండా ముస్లిం మహిళలు వెళ్లనే కూడదని స్పష్టం చేస్తూ...మొబైల్ ఫోన్ల వాడకాన్ని తగ్గించాలని వారిని కోరింది. ఈ మేరకు ‘ఇస్లామిక్ మర్కాజీ మజ్లీస్-ఎ-షౌర’( ఇస్లామిక్ కేంద్ర సలహా మండలి) కిష్వర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గోడపత్రికలను అంటించింది. జిల్లాలోని ప్రధాన జామియా మసీదుతో సహా పలుప్రాంతాల్లో ఉర్దూలో ముద్రించిన ఈ గోడపత్రికలు కనిపించాయి. పెళ్ళిళ్ల సమయంలో నృత్య, సంగీత కార్యక్రమాలను నిర్వహించే కుటుంబాలు సామాజిక బహిష్కరణను ఎదుర్కోవలసి వస్తుందని కూడా హెచ్చరించింది. పెళ్లి నిశ్చితార్థాల జోలికిపోకుండా నేరుగా ‘నిఖా’లనే నిర్వహించేయాలంది. నిశ్చితార్థాల వల్ల సమాజంలో లేనిపోని దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయంది. బజార్లలో అలా పనీపాటా లేకుండా తిరగకుండా... మసీదులో అయిదుపర్యాయాలూ క్రమం తప్పకుండా నమాజుకు హాజరుకావలసిందిగా ముస్లిం యువతను కోరింది.