ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు మొదలు అన్ని పనుల్లో మోసం చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులు చేస్తున్నవారంతా చంద్రబాబు బినామీలేనని అన్నారు. ఆడలేక మద్దెల ఓడు సామెత చందంగా ఆయన అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. విభజన చట్టంలోని హామీలను అమలుచేయించడంలో చంద్రబాబు విఫలమయ్యారని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయని తెలిపారు. సదావర్తి భూముల విషయంలో కోర్టులను కూడా టీడీపీ ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని అన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన కోర్టు చీవాట్లు పెట్టినా... చంద్రబాబు తుడుచుకుని పోతున్నారని అన్నారు. సదావర్తి భూముల విషయంలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు.