న్యూఢిల్లీ: రైల్వేల్లో 36 ఏళ్ల వీఐపీ కల్చర్కు ఫుల్స్టాప్ పడింది. రైల్వే బోర్డు చైర్మన్, బోర్డు మెంబర్స్ వస్తే జనరల్ మేనేజర్స్ కచ్చితంగా వాళ్లకు వెల్కమ్ చెప్పాలన్న ప్రొటోకాల్ను రద్దు చేశారు. ఇక సీనియర్ అధికారుల ఇళ్లలో పని చేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగులు వెంటనే ఉద్యోగాల్లో చేరాలని ఆదేశాలు జారీ అయ్యాయి. సెప్టెంబర్ 28న ఈ మేరకు రైల్వే శాఖ కొత్త నిబంధనలు జారీ చేసింది. 1981లో జారీ అయిన ఈ ప్రొటోకాల్ నిబంధనలన్నీ ఇక రద్దయ్యాయి. అంతేకాదు రైల్వే బోర్డు మెంబర్లు, జనరల్ మేనేజర్లు ఎగ్జిక్యూటివ్ క్లాస్లలో ప్రయాణం ఆపేసి.. స్లీపర్క్లాస్, 3 టైర్ ఏసీల్లో ప్రయాణించాలని, ప్రయాణికులతో మమేకమవ్వాలని రైల్వే మంత్రి పియూష్ గోయెల్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సుమారు 30 వేల మంది కింది స్థాయి ఉద్యోగులు సీనియర్ అధికారుల ఇళ్లలో పని చేస్తున్నట్లు అంచనా. ఈ తాజా ఆదేశాలు జారీ అయిన తర్వాత ఏడు వేల మంది వరకు తిరిగి ఉద్యోగాల్లో చేరినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. మిగతా వాళ్లు కూడా ఆదేశాలను కచ్చితంగా పాటించి ఉద్యోగాల్లో చేరాలని స్పష్టంచేశారు. ఇక రైల్వే బోర్డు చైర్మన్, ఇతర సభ్యులు జోన్ల పరిశీలనలకు వస్తే బొకేలు, దండలతో వెల్కమ్ చెప్పడం నిషేధం అని చైర్మన్ అశ్వని లోహానీ చెప్పారు.