రానున్న ఏడాది కాలంలో రైల్వేల ద్వారా 10 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆ శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.రైల్వే ట్రాక్ల ఆధునికీకరణకు త్వరలో గ్లోబల్ టెండర్లను ఆహ్వానించనున్నామని తెలిపారు. దీని వల్ల ఒక ఏడాదిలో రైల్వే అనుబంధంగా ఈ ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఇక్కడ నిర్వహించిన ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
రైల్వేల్లో భద్రతే తమకు ప్రాధాన్య అంశమని పేర్కొన్నారు. ఇందుకోసం ఎంత ఖర్చుకైనా వెనకాడబోమని స్పష్టంచేశారు. ఇటీవల వరుసగా జరిగిన రైలు ప్రమాదాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న ట్రాక్లను మరింత పరిష్ఠపరుస్తామని, త్వరలో ఇందుకోసం టెండర్లు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. రైల్వేల్లో నేరుగా ఈ ఉద్యోగాలు రానప్పటికీ రైల్వే పనులు.. రానున్న 12 నెలల్లో పది లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాయని పేర్కొన్నారు. రైల్వే ట్రాక్లు, భద్రతకు సంబంధించిన పనుల వల్లే సుమారు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు.